ప్రధాని మోదీ పాల్గొనే చిలకలూరిపేట సభా ప్రాంగణం వద్ద లోకేశ్ భూమిపూజ

 


ఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ ఉదయం బొప్పూడి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సభా ప్రాంగణం వద్ద భూమిపూజ చేశారు. అంతకుముందు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. వివిధ కమిటీలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు.  చిలకలూరిపేట సభను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న టీడీపీ.. లక్షలాదిగా తరలిరానున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ, జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో లక్షలాదిమందితో విజయవంతం చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ సభకు హాజరవుతుండడంతో లోకేశ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.